వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే చూసీచూడనట్లు వెళ్లిపోయే ఈ రోజుల్లో, ఖాకీ చొక్కా వెనుక ఉన్న కరుణను ఓ పోలీస్ అధికారి కళ్లకు కట్టారు. హంటర్ రోడ్డు నుంచి తన విధులకు వెళ్తున్న పర్వతగిరి సీఐ రాజగోపాల్, జేఎస్ఎం కళాశాల వద్ద కారు స్కూటీని ఢీకొట్టిన ప్రమాదాన్ని గమనించారు. స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులు రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో పడి ఉండటం చూసి ఆయన తక్షణం స్పందించారు.
తన ప్రయాణాన్ని ఆపి, క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒక ఆటో మాట్లాడి, గాయపడిన వ్యక్తిని అందులో ఎక్కించారు. కేవలం ఆస్పత్రికి పంపించి చేతులు దులుపుకోకుండా, స్వయంగా ఆ ఆటోలోనే తోడుగా కూర్చుని హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో నేరుగా మాట్లాడి అత్యవసర వైద్య సేవలు అందేలా చూడటమే కాకుండా, భయంతో ఉన్న ఆ దంపతులకు కొండంత భరోసా ఇచ్చారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ సాటి మనుషుల పట్ల పట్టింపు లేని ప్రస్తుత సమాజంలో, ఒక నిరుపేద కుటుంబం ప్రాణాలు కాపాడేందుకు సకాలంలో స్పందించిన సీఐ రాజగోపాల్ తీరు నేటి యువతతో పాటు పాత తరానికి సైతం ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది.
