• ఇద్దరు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

వేద న్యూస్, వేములవాడ అర్బన్:

వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం భగ్నం చేశారు. బ్రాండెడ్ మద్యం సీసాలను సేకరించి వాటిలో నీళ్లు, చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇద్దరు నిందితులు గత ఆరు నెలలుగా ఈ కల్తీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు నిందితుల ఇంటిపై దాడి నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు పెద్దఎత్తున ఖాళీ మద్యం సీసాలు, కల్తీ లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యం విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు మీడియా సమావేశంలో హెచ్చరించారు.