వేద న్యూస్, హైదరాబాద్ : బోడుప్పల్లో ఉద్యమకారులు చేపట్టిన భూపోరాటం సందర్భంగా జరిగిన ఘటనలపై తెలంగాణ రక్షణ సేన స్పందించింది. ఈ సందర్భంగా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పార్టీ అభిప్రాయపడింది. శాంతియుత నిరసనలో పాల్గొన్న పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు మహిళా ఉద్యమకారులపై జరిగిన ఘటనలపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన కోరింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తితో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర సీనియర్ నాయకులు రాము యాదవ్ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయంలో అధికారిక ఫిర్యాదు పత్రాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఈ అంశంపై న్యాయసమ్మతమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
