వేద న్యూస్, జమ్మికుంట:
నవంబర్ 14 ను ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే)గా జరుపుకుంటాం. డయాబెటిస్పై అవగాహన పెంపొందించడం, నిరోధక చర్యలు తీసుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ డే ను జరుపుకుంటారు.
ఒకే చోట కూర్చుని ఉండటం, శారీరక శ్రమను మరిచిపోవడం కాకుండా జీవనశైలి మార్పుయే డయాబెటిస్కు మందు అని నిపుణులు పేర్కొంటున్నారు.
మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉండటం ఆందోళనకర విషయం. కాగా, మధుమేహం నివారణకు, నియంత్రణకు ప్రముఖ వైద్యుడు కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ కీలక సూచనలు చేశారు.
ఆహార నియమాలు
చక్కెర, స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించాలని, ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, సంపూర్ణ ధాన్యాలు (తీసుకోవాలని డాక్టర్ సురేశ్ తెలిపారు.తక్కువగా అయినా కానీ తరచుగా తినడం మంచిదని, రాత్రి భోజనం తేలికగా చేయాలని వెల్లడించారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయాలని, బరువు నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పారు.
పొగ తాగడం, మద్యం వాడకం పూర్తిగా మానేయాలని, ఒత్తిడి (స్ట్రెస్) తగ్గించుకోవాలని, యోగా, ధ్యానం, సరదా కార్యకలాపాలు చేయాలని తెలిపారు. నిద్ర సరిపడా (6–8 గంటలు) పడుకోవాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని వెల్లడించారు.
రక్తంలో చక్కెర స్థాయిలను (ఎఫ్బీఎస్, పీపీబీఎస్, హెచ్బీఏ1సీ)లను నియమితంగా పరీక్షించుకోవాలని, కంటి, మూత్రపిండాలు, పాదాల ఆరోగ్యం కూడా పర్యవేక్షించాలన్నారు. మధుమేహం ఉన్నవారు వైద్యుని సూచనల ప్రకారం మందులు నియమితంగా తీసుకోవాలని తెలిపారు.