వేద న్యూస్, జమ్మికుంట:

శనివారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇన్ చార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ప్రభాకర్ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేశిని స్వప్న-కోటి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995 నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పని చేశానని, ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, ఇల్లందకుంట ఆలయ చైర్మన్‌గా, ఉమ్మడి జమ్మికుంట మండలానికి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయానని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశానని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి తనకు అండగా నిలిచిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ వీడాల్సి వచ్చిందని తెలిపారు. కానీ మళ్లీ కాంగ్రెస్ కండువా మెడలో వేసుకున్న తర్వాత తనకు గొప్ప అనుభూతి కలిగిందని వెల్లడించారు. 23 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో చేశానని  చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వొడితల ప్రణవ్ నాయకత్వంలో పార్టీ కోసం పని చేస్తానని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్తి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.