రైతుల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం..
వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపేట:
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు సురేష్ ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతపులిని చూశాడు. వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళనకు లోనవుతున్నారు.పంటపొలాల్లోకి వెళ్లడంలో రైతులు వెనుకంజ వేస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు చిరుత అడుగుజాడలను గుర్తించారు.ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ సఖారం మాట్లాడుతూ, చిరుతపులి కోసం ఎల్లారెడ్డిపేట శివారు నుంచి వెంకటాపూర్ శివారు వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి. చిరుతను ఎక్కడైనా గమనించిన వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.
చిరుత సంచారంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు, ముఖ్యంగా రైతులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ గాలింపు చర్యలు కొనసాగుతోంది.