వేద న్యూస్, హైదరాబాద్ :
నీట్ (NEET) పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ కీలక పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు. వైద్య విద్యలో ప్రవేశానికి ముఖ్యమైన ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతోకాలంగా కృషి చేశారని పేర్కొన్న ముఖ్యమంత్రి, తమ శ్రమ, పట్టుదలపై నమ్మకం ఉంచి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా నిబంధనలను పాటిస్తూ ప్రశాంతమైన మనసుతో పరీక్ష రాయాలని సూచించారు. విద్యార్థులందరూ తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.